రుణమాఫీ” – తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన పదం. గతంలో టీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చి పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో రైతుల్లో నిరాశ నెలకొంది. ఆ నిరాశనే క్యాష్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఒకేసారి ₹2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ప్రజల మద్దతు పొందింది.
హామీ ఇచ్చారు కానీ అమలు ఎప్పుడు?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.
డిసెంబర్ 9 తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు “చేస్తున్నాం – చేస్తాం” అంటూ స్పష్టత ఇవ్వకపోవడంతో సందేహాలు మొదలయ్యాయి.
ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు దీనిపై తీవ్ర విమర్శలు చేస్తూ, “రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోతున్నారు” అంటుంటే,ప్రభుత్వ నేతలు మాత్రం “చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, ప్రజలు అర్థం చేసుకుంటారు” అంటూ సమాధానం ఇస్తున్నారు.
బ్యాంకుల లీగల్ నోటీసులు – రైతులకు షాక్
ఇక మరోవైపు బ్యాంకులు రుణగ్రహీతలపై కఠిన చర్యలు ప్రారంభించాయి.
2024 జనవరి 20న ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (APGVB) – టేకుమట్ల బ్రాంచ్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) ఒక రైతుకు లీగల్ నోటీసు జారీ చేసింది.
నోటీసులో ఇలా పేర్కొన్నారు:
“మీరు వ్యవసాయ సాగు కోసం పొందిన రుణం ఇప్పటికీ చెల్లించలేదు. ఈ నోటీసు అందిన వారం రోజుల్లోపు మొత్తం చెల్లించకపోతే, మీ స్థిర, చర ఆస్తులను జప్తు చేసి వేలం వేస్తాము.”
అంతేకాదు,
“మీ పేరు బ్లాక్లిస్టులో చేర్చమని కలెక్టర్ గారికి నివేదిస్తాము. బ్లాక్లిస్టులో ఉన్నవారికి సబ్సిడీ, రేషన్, పెన్షన్ నిలిపివేయబడుతుంది,” అని కూడా పేర్కొన్నారు.
రైతుల ఆవేదన
ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి ఆలస్యం చేయడం, బ్యాంకులు లీగల్ నోటీసులు ఇవ్వడం రైతులను క్లిష్ట పరిస్థితిలోకి నెడుతోంది.
పలు జిల్లాల్లో రైతులు బ్యాంకుల ముందు ఆందోళనలు కూడా ప్రారంభించారు.
రాజకీయ ప్రతిస్పందనలు
బీఆర్ఎస్: “కాంగ్రెస్ రైతులను మోసం చేస్తోంది” అని ఆరోపించింది.
కాంగ్రెస్ నేతలు: “రుణమాఫీ సీరియస్గా అమలు చేస్తాం, కొంత సమయం ఇవ్వండి” అని చెబుతున్నారు.
రైతు సంఘాలు: “ఇదే కొనసాగితే ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుంది” అని హెచ్చరిస్తున్నాయి.
