రైతు భరోసాపై అనేక ఊహాగానాలకు,అనుమానాలకు తెరదించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రైతు భరోసాపై పథకం అమలుపై సీఎం క్లారిటీ ఇచ్చారు. రైతు ఎంత భూమిని సాగు చేసుకుంటే అంత భూమికి రైతు భరోసా ఇస్తామన్నారు. సాగు భూములకు సీలింగ్ లేదని ప్రకటించారు.ఈ పథకం కింద ప్రతి ఏడాది 12 వేలు రైతు భరోసా ఇస్తామని సీఎం తెలిపారు.అయితే.. వ్యవసాయ యోగ్యం కాని భూములు.రాళ్లు ఉన్న భూములు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో కోల్పోయిన భూములు, పడావు పడ్డ,బీడు భూములుకు, మైనింగ్ కోసం ఇచ్చిన ల్యాండ్కు, రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన భూములకు రైతు భరోసా ఇచ్చే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అలాగే.. నాలా కన్వర్టెడ్ భూములకు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా ఇవ్వబోమని సర్కార్ స్పష్టంచేసింది. రైతుభరోసా ఏ భూములకు రాదో వివరించేందుకు రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తారని దీనిపై ఆందోళన అక్కర్లేదని సిఎం తెలిపారు. దరఖాస్తులు లేకుండానే రైతు భరోసా అందించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. వ్యవసాయ యోగ్యమైన భూమికే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినందున మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఏడాదికి ఎకరాకు 10వేల రూపాయలిస్తే తాము 12 వేల రూపాయలు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Thank you for reading this post, don't forget to subscribe!తెలంగాణలో భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12 వేల రూపాయలను ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుభరోసా ఈనెల నుంచే అమలు కానుంది. ఈనెల 26 నుంచి రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.